కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం అని ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన తనయుడు ఏ.ఆర్. హమీన్తో కలిసి చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కోవిషీల్డ్ మొదటి డోస్ టీకా వేయించుకున్నట్టు ఏఆర్ రెహమాన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వారి ఫొటోలను షేర్ చేశారు.
ఇక డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల నిర్మాతగా మారి తానే కథ, స్క్రీన్ ప్లే అందించి 99 సాంగ్స్ అనే రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టొరీని తెరకెక్కించారు. ఈ సినిమాలో జయ్ అనే పాత్రలో హీరో ఇహన్ భట్ , సోఫియా పాత్రలో ఎడిల్సి వర్గాస్ కనిపించి అలరించారు. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకునే కుర్రాడి ప్రేమ ప్రయాణంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలనుకోగా, కరోనా సెకండ్ వేవ్ వలన నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు.