హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులో నామినేషన్లు పోటెత్తాయి. చివరిరోజైన ఆదివారం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 2,871 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్క గ్రేటర్ వరంగల్లోనే 1,487 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఖమ్మంలో 377, జడ్చర్లలో 222, నకిరేకల్లో 214 అచ్చంపేటలో 99, కొత్తూరులో 66, సిద్దిపేటలో 406 నామినేషన్లు రాగా, మొత్తంగా 2,204 మంది అభ్యర్థులు 3,630 నామినేషన్లు వేసినట్టు ఎస్ఈసీ అధికారులు వివరించారు. వరంగల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు 1,753 నామినేషన్లు వచ్చాయి. ఇందులో టీఆర్ఎస్ 706, బీజేపీ 294, కాంగ్రెస్ 247, టీడీపీ 21 దాఖలుచేశాయి. ఖమ్మం కార్పొరేషన్లో 60 డివిజన్లకు 522 రాగా, టీఆర్ఎస్ 163, కాంగ్రెస్ 125, బీజేపీ 84, టీడీపీ 16 వేశాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు 575 నామినేషన్లు రాగా, టీఆర్ఎస్ 210, కాంగ్రెస్ 56, బీజేపీ 119 దాఖలుచేశాయి. జడ్చర్లలో 27 వార్డులకు 241 నామినేషన్లు రాగా, టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 43, బీజేపీ 42 వేశారు. నకిరేకల్లో 20 వార్డులకు 305 నామినేషన్లు దాఖలుకాగా, టీఆర్ఎస్ 81, కాంగ్రెస్ 44, బీజేపీ 36, టీడీపీ 3 వేశాయి. అచ్చంపేటలో 20 వార్డులకు 149 నామినేషన్లు రాగా, టీఆర్ఎస్ 60, బీజేపీ 28, కాంగ్రెస్ 49 వేశాయి. కొత్తూరులో 12 వార్డులకు 85 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ పత్రాల పరిశీలన జరగనున్నదని అధికారులు తెలిపారు.