నింగి నుంచి ఏకధాటిగా నిప్పుల వాన.. చెవులు చిల్లులు పడేలా భీకర శబ్దాలు.. చూస్తుండగానే పేక మేడల్లా కూలిపోతున్న భారీ భవంతులు.. రెప్పపాటులో ప్రాణాలు విడుస్తున్న అమాయకులు.. పశ్చిమాసియాని మహా ప్రళయం కబళిస్తున్నదా అనేలా సాగుతున్న పాలస్తీనా-ఇజ్రాయెల్ పరస్పర దాడులు అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. భీకర దాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా నగరాలు దద్దరిల్లుతున్నాయి. గత మూడు రోజుల్లో గాజా నుంచి 1050కు పైగా రాకెట్లను ‘హమాస్’ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించగా.. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ బలగాలు అదేరీతిలో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో బుధవారంనాటికి 43 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 13 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడుల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరణించిన మహిళల్లో ఒకరు కేరళకు చెందినవారిగా అధికారులు వెల్లడించారు. రాజధాని నగరం జెరూసలెంలోని ఆల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం జరిగిన ఘర్షణలు తాజా ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి.
హమాస్ రాకెట్ దాడుల నుంచి ఇజ్రాయెల్ అతిస్వల్ప నష్టంతో బయటపడింది. దీనికి కారణం ‘ఐరన్డోవ్ు’ ఎయిర్ డిఫెన్స్ సిస్టవ్ు. రాకెట్లు, శతఘ్నులను గాల్లోనే ధ్వంసంచేసేందుకు అమెరికా సాయంతో దశాబ్దం క్రితం ఇజ్రాయెల్ ఈ ఐరన్డోమ్ వ్యవస్థను నిర్మించుకున్నది. శత్రువుల రాకెట్లను పసిగట్టడానికి రాడార్లు, ఆ రాకెట్ను కూల్చేయడానికి ప్రత్యేక చిన్న రాకెట్లు, అవి దూసుకుపోయేందుకు సాఫ్ట్వేర్, బ్యాటరీలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. అందుకే, హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన 90 శాతం రాకెట్లను ఈ ఐరన్డోమ్ తునాతునకలు చేసి భారీ నష్టాన్ని తగ్గించింది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటివి కావు. తూర్పు జెరూసలేం శివారుల్లోని షేక్ జర్రా, సిల్వాన్ ప్రాంతాల్లోని పాలస్తీనీయుల నివాసాలను ఇజ్రాయెలీస్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో తాజాగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ భూవివాదం గత 150 ఏండ్ల క్రితం మొదలైంది. 1876లో ఇక్కడి భూములను యూదులు కొనుగోలు చేశారు. కానీ, 1876 తర్వాత జోర్డాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అనంతరం ఈ ప్రాంతాల్లో పాలస్తీనీయులు వచ్చి స్థిరపడ్డారు. 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకొంది. అయితే ఆ భూముల్లో ఇప్పటికీ పాలస్తీనీయులే ఉంటున్నారు. ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు కూడా ఈ భూములు యూదులకే చెందుతాయని పేర్కొంది. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకొనే అంశంపై పాలస్తీనీయులకు, ఇజ్రాయెలీయులకు మధ్య ఘర్షణ మొదలైంది. పవిత్ర రంజాన్ చివరివారమైన శుక్రవారం కొంతమంది ఇజ్రాయెల్ దళాలతో ఘర్షణ పడుతూ అల్-అక్సా మసీదులో దాక్కొన్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఇజ్రాయెల్ దళాలను.. ప్రార్థనలకు వచ్చిన పాలస్తీనియన్లు, మరికొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చెలరేగింది. ఈ పరిణామాల తర్వాత జెరూసలేంలోని పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతూ.. గాజాపట్టీ నుంచి ‘హమాస్’ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీదకు రాకెట్ దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి.