యాదాద్రి లక్ష్మీనరసింహుడికి గురువారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించారు. ఈ నెల 15న ప్రారంభమై 11 రోజుల పాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి డోలోత్సవంతో అర్చకులు ముగింపు పలికారు. స్వామివారి బాలాలయం మండపంలో 108కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్పించారు. అష్టోత్తర శత ఘటాలకు ముక్కోటి దేవతలను ఆవాహన చేసి ఆహుతులను సమర్పించారు. మహాపూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి శాంతి అభిషేకం చేశారు. 108 సంఖ్యతో భగవానుడి యొక్క తత్తం నిక్షిప్తమై ఉన్నందున అష్టోత్తర శతఘటాభిషేకానికి ఎంతో విశిష్టత ఉందని అర్చకులు తెలిపారు. శ్రీవారి అమ్మవార్లకు పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ సుగంధ ద్రవ్యాలు, ఫల జలాలు, సుగంధ భరిత ఏలాలవంగాది చూర్ణ జలాలు, మంత్ర పూర్వక జపాలతో అభిషేకించారు. సాయంత్రం నిత్యారాధనలు చేసిన అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామివారి శృంగార డోలోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యజ్ఞచార్యులు, వేదపండితులను ఘనంగా సన్మానించి, ఉత్సవ పరిసమాప్తికి సూచకంగా మంగళ నీరాజనాలు పలికారు.
యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు దోర్బాల భాస్కర్శర్మ, శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవ పరిసమాప్తికి సూచకమే అష్టోత్తర శతఘటాభిషేకం
గత 11 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి సూచకంగా అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు అభిషేక మహోత్సవాన్ని ఆగమశాస్ర్తానుసారంగా చేపట్టారు. ఈ ఘటాభిషేకంలో కలశాలలో ఆవాహన చేసిన పవిత్ర జలాలతో పాటు వివిధ ఫలాల రసాలను మంత్ర పూతములను గావించి అభిషేకించడమే ఈ వేడుక ప్రత్యేకత. సృష్టిలోని సర్వవిధ ఫలాలు, పుష్పాలు, రసాలు, జలాలు భగవత్ ప్రీతికరములై ఉన్నందున వాటిని భగవత్ సమర్పణ బుద్ధితో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. పంచామృత స్నపన ఫలితాలను ఆగమశాస్త్రంలో పేర్కొనుచూ.. ఇహ, పరముక్తి ప్రదం సర్వవిధ శుభంకరం అని మరెన్నో అద్భుతాలైన ఫలితాలను అందించగలదని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి.
నేటి నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 11 రోజులుగా రద్దు చేసిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహహోమం, అర్చనలు, భోగాలు, బలిహరణ, అభిషేకాలు, మొక్కు సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
అంబరాన్నంటిన బ్రహ్మోత్సవాలు
గత 11 రోజులుగా సాగిన యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పాల్గొని పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారికి దేవస్థానం పక్షాన దాసోహములు. గౌరవ అతిథులుగా విచ్చేసిన దేవదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్, ఆదనపు కమిషనర్ సుధీర్బాబు, డీసీపీ నారాయణరెడ్డి, టీటీడీ ప్రధాన అర్చకులు డాలర్ శేషాద్రిలకు ప్రత్యేక ధన్యవాదాలు. బ్రహ్మోత్సవ నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ వంతు సహాయ సహకారాలందించిన ప్రతి ఒక్కరికి, స్థానికులు, భక్తులకు పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.