ముషీరాబాద్ : అన్ని వర్గాలకు భరోసానిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిలుస్తున్నదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. గతంలో మాదిరి అంకెల గారడీ కాకుండా కేటాయింపులకు మించి ఖర్చు చేస్తూ కొత్త పథకాల అమలుతో టీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయతను చాటుకుంటుందని అన్నారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్-మానవీయ కోసం అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బడ్జెట్ అంటే చిట్టా పద్దులు, అంకెల గారడీ కాకుండా అభివృద్ధికి బాటలు వేసేలా దేశానికి కొత్త నిర్వచనాన్ని అందించిందని అన్నారు. సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య ఎం.భాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి మల్లేల బాబురావు, బాబా చంద్రపాల్, ఓంకార్ రాజు, డాక్టర్ వెంకటేశ్వర్రావు, సంగ శ్రీనివాస్ నేత, డాక్టర్ సురేందర్, రంగయ్య, టీ.నరసింహాచార్యులు, నాంపల్లి శ్రీనివాస్, రఘుపతి, బండి శ్రీనివాస్తోపాటు పలువురు మేధావులు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు.