న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకువెళుతుండటం పట్ల సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ స్పందించారు. కేరళలో గత నాలుగు దశాబ్ధాలుగా ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదని, ఎల్డీఎఫ్ ఈ ఒరవడిని తిరగరాసి చరిత్ర సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు.
వరదలు, కొవిడ్-19 వంటి విపత్తులను పినరయి విజయన్ సర్కార్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును కేరళ ప్రజలు సమర్ధించారని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ప్రజానుకూల విధానాలతో అభివృద్ధి దిశగా పినరయి విజయన్ సర్కార్ పాటుపడినందుకే ఓటర్లు ఆదరించారని కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంపై విజయన్ అభిప్రాయపడ్డారు.ఇక కేరళలో 140 స్ధానాలకు గాను పాలక ఎల్డీఎఫ్ 96 స్ధానాల్లో, యూడీఎఫ్ 42 స్ధానాల్లో బీజేపీ ఒక స్ధానంలో ఆధిక్యం కనబరుస్తున్నాయి.