ముంబై, ఏప్రిల్ 8: కార్పొరేట్ రెవిన్యూ మళ్లీ రెండంకెల వృద్ధిని అందుకున్నది. వరుసగా 8 త్రైమాసికాలు క్షీణించడమో లేదా స్వల్ప (సింగిల్ డిజిట్) వృద్ధికే పరిమితమైన నేపథ్యంలో ఈ జనవరి-మార్చిలో 15-17 శాతం వృద్ధిరేటు నమోదైంది. రూ.6.9 లక్షల కోట్లకు చేరింది. పెరిగిన వస్తూత్పాదక ధరలు.. సంస్థల ఆదాయాన్ని, ఆపై నిర్వహణ లాభాలను 28-30 శాతం పెంచాయని గురువారం క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన ఆర్థిక సేవలు, చమురేతర రంగాలకు చెందిన 300 సంస్థలపై అధ్యయనం ద్వారా తాజా వివరాలను క్రిసిల్ తెలియజేసింది. ఎన్ఎస్ఈ సంస్థల మార్కెట్ విలువలో ఈ 300 కంపెనీల మార్కెట్ విలువ 55-60 శాతంగా ఉన్నది.