హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ చేసిన జీవోల ప్రకారమే కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంది. ఈ ప్రాజెక్టులు అక్రమం అంటే.. అప్పుడు జారీ చేసిన జీవోలు అక్రమమా..? అని సీఎం జగన్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి దృష్టి మళ్లించడానికి, తదితర అంశాలను సీఎం జగన్ తెరపైకి తీసుకువస్తున్నారని తెలిపారు. జల వివాదాలను అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకుందామని, సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుందామని చెప్పింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే కొత్త కేటాయింపులు జరుగుతాయని, దాని ప్రకారమే ప్రాజెక్టులు కడుతామని చెప్పింది జగన్ కాదా? అని అడిగారు.
ఆంధ్రప్రదేశ్కు 30 శాతం నీటి కేటాయింపులు జరిగితే.. 60 శాతం నీళ్లు వాడుకునేందుకు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్నింటినీ కేంద్ర స్థాయిలో పరిష్కరించుకుందామని జగన్ అంటుంటే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంతో కుమ్మకై ప్రాజెక్టులు కొనసాగిద్దామని జగన్ ఉద్దేశమా? అని అడిగారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ వితండవాదం చేస్తోందన్నారు.
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కేఆర్ఎంబీ పరిధిలోకి నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవొద్దని, తొందరపడి కేంద్రం నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నీటి కేటాయింపుల ప్రకారం ప్రాజెక్టులు కడుతామంటే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ఇంజినీర్లు కూడా సహకరిస్తారని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు విషయంలో మోదీ తమకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే మోదీని కలిసి తమ ప్రాజెక్టులకు న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపి తీరుతామని స్పష్టం చేశారు.
రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. జగన్కు అతిథ్యమిచ్చి తన ఆలోచనలు పంచుకున్నారు. కలిసిమెలిసి ఉండాలని కేసీఆర్ చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కానీ ఏపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తమ కడుపు మండి మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ధర్మం, న్యాయం తమ వైపు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.