ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,36,116 ఎకరాలు
37,324 మంది గిరిజన రైతులకు ప్రయోజనం
రెండు సీజన్లకూ రూ.136.11 కోట్ల సాయం
ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగు చేస్తున్న రైతులు నానా అవస్థలు పడ్డారు. గిరిజనులకు నామమాత్రంగా అటవీ భూముల హక్కు పత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల భూములపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రైతుల మాదిరిగా అటవీ హక్కు పత్రాలు ఉన్న గిరిజన రైతులకూ రైతుబంధు పథకం వర్తింపజేసింది. ఫలితంగా పంట పెట్టుబడులకూ ఇబ్బందులు లేకుండా పోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,36,116 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములు ఉండగా.. 37,324 మంది గిరిజన రైతులు వాటిని సాగు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం రెండు సీజన్లకూ రూ.136.11 కోట్లు పంపిణీ చేసింది. సర్కారు అందిస్తున్న సాయంపై గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ప్రభుత్వం అటవీహక్కుల చట్టం కింది రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేసింది. వీరికి సంబంధించిన వివరాలు సరిగా లేకపోవడంతో ప్రభుత్వ సాయానికి వీరు నోచుకోలేదు. నామ్ కే వాస్తేగా పేద గిరిజనులు హక్కు పత్రాలు ఇచ్చిన గత పాలకులు చేతులు దులుపుకున్నారు. ఫలితంగా వారికి ఎలాంటి సర్కారు సాయం అందకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పంపిణీచేసిన అటవీ భూముల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చకపోవడంతో పహణీలు రాకపోగా బ్యాంకు రుణాలు సైతం లభించలేదు. దీంతో గిరిజన రైతులు పంట పెట్టుబడుల లేక భూములను సాగుచేయలేని పరిస్థితి నెలకొంది. మరికొందరు రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ప్రైవేట్ వ్యా పారుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. సర్కారు ఆదేశాల మేరకు మూడేళ్ల కిందట అధికారులు ఆర్వోఎఫ్ఆర్ భూములున్న రైతులు వివరాలను సేకరించారు. పట్టాలున్న రైతులు బతికి ఉన్నారా, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారా, భూములను ఎవరూ సాగు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. పూర్తి పరిశీలన అనంతరం వారి వివరాలను ఐటీడీఏ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో జిల్లాలో ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగుచేస్తున్న రైతుల వివరాల లెక్కతేలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 37324 మంది రైతులు 136116 ఎకరాల భూములను సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు.
రూ. 136.11 కోట్ల సాయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు ప్రభుత్వం వానకా లం సీజన్కు సంబంధించి రూ. 858.88 కోట్ల రైతుబంధు సాయం అందిస్తుంది. వీరితో పాటు ఆర్వోఎఫ్ఆర్ భూ ములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు సైతం పంటపెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 37,324 మంది రైతులకుగానూ రెండు సీజన్లకుగానూ రూ.136.11 కోట్ల రైతుబంధు డబ్బులు అందాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17,657 మంది రైతులు 69,654 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12,635 మంది రైతులు 46,329 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 5500 మంది రైతులు 16,589 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1532 మంది రైతులు 3544 ఎకరాల భూములను సాగు చేస్తున్నారు. సర్కారు అందిస్తున్న పట్టపెట్టుబడి సాయం పట్ల గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దళారులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుని పంటలు వేసుకునే వారమని అప్పులు ఇచ్చిన వారు పంటలు తీసుకుని లెక్క సరిపెట్టేవారని గిరిజన రైతులు అంటున్నారు. సర్కారు అందిస్తున్న సాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు వస్తుండడంతో జిల్లాలోని 17,657 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. రెండు సీజన్లకుగానూఎకరాకు రూ. 5 వేల చొప్పున రూ.70 కోట్ల పంట పెట్టుబడి సాయం అందింది. జిల్లాలో ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగుచేస్తున్న రైతులు ఆదిలాబాద్ రూరల్ మండలంలో 1895 మంది రైతులు, బజార్హత్నూర్లో 915 మంది, బేలలో 1421 మంది రైతులు, భీంపూర్లో 262 మంది, బోథ్లో 1358, గాదిగూడలో 1794 మంది రైతులు, గుడిహత్నూర్లో 880, ఇచ్చోడ మండలంలో 966 మంది రైతులు, ఇంద్రవెల్లి మండలంలో 853 మంది, జైనథ్లో 311 మంది రైతులు, మావలలో ఆరుగురు, నార్నూర్లో 972 మంది, నేరడిగొండలో 2476 మంది, సిరికొండలో 644 మంది, తలమడుగులో 538 మంది, ఉట్నూర్లో 2366 మంది రైతులు ఉన్నారు. రైతుబంధు పథకం రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల బాధలు తప్పినయ్
నాకు 2.50 ఎకరాల భూమి ఉంది. మాకు అప్పటి సర్కారు పట్టాలు ఇచ్చినా లెక్కలు సరిగా లేకపోవడంతో బ్యాంక్లోన్లు దొరుకలేదు. ఎవుసం చేద్దామంటే అప్పులు చేయాల్సి వచ్చేది. దళారుల వద్దకు పోతే విత్తనాలు, ఎరువులు ఇచ్చి పంటలు మాకు అమ్మాలని షరతు పెట్టేవారు. పంట అంతా తీసుకుని లెక్క బారాబర్ చేసేటోళ్లు. తెలంగాణ సర్కారు మా అసుంటి రైతులకు రైతుబంధు ఇవ్వడం సంతోషంగా ఉంది. అప్పుల బాధలు తప్పినయ్.
సీఎంకు రుణపడి ఉంటం
తెలంగాణ సర్కారు ఎకరానికి రూ.5 వేలు ఇస్తుంది. మాలాంటి పేద రైతులకు ఇవ్వి ఎంతో అక్కరకు వస్తున్నయ్. విత్తనాలు, ఎరువుల కోసం దళారులు వద్ద అప్పులు చేయాల్సిన పనిలేకుంటైంది. గా పైసలతోనే మాకు ఇష్టమైన మంచి విత్తనాలు, ఎరువులు కొనుక్కున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తుండు.. గిసొంటి సీఎంను చూడలేదు. ఆయనకు రుణపడి ఉంటం.