జగదేవ్పూర్, మే 18 : రైతులు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం జగదేవ్పూర్తోపాటు పీర్లపల్లి, మునిగడప, మాందాపూర్, వట్టిపల్లి, తీగుల్నర్సాపూర్, చిన్నకిష్ణాపూర్, రాయవరం, తీగుల్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 15 వేల క్వింటాళ్ల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా 35 వేల కింటాళ్ల ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వానలు పడినప్పుడు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లకు రూ.26 వేల కోట్లు…
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో హమాలీల కొరత ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కూలీలను వినియోగించుకోవాలని అధికారులనే సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి సరోజిని, ఎంపీపీ బాలేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సధాకర్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, భాను, భిక్షపతి, యాదవరెడ్డి, రజితారమేశ్, కనకయ్య, నరేశ్, రైతుబంధు సమితి నాయకులు పాల్గొన్నారు.
పూర్తిగా ఆరిన ధాన్యాన్నే తీసుకురావాలి..
ములుగు, మే 15 : రైతులు పూర్తిగా ఆరిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని క్లస్టర్ ఇన్చార్జి, తహసీల్దార్ రఘువీర్రెడ్డి సూచించారు. మండలంలోని క్షీరసాగర్లో పీఏసీఎస్ ములుగు ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రా న్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రఘువీర్రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా రైతులు సరిపడా టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకోవాలని, వాటికి నగదును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని ప్రైవేట్ వాహనాల్లో రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పీఏసీఎస్ సీఈవో రమేశ్బాబు ఉన్నారు.
వర్షాల దృష్ట్యా ధాన్యం తరలింపు చేపట్టాలి..
చిన్నకోడూరు, మే 18 : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపును వెంటనే చేపట్టాలని నిర్వాకులకు ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండలంలోని మాచాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూనే కొనుగోళ్లు, తరలింపు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీడీవో వెంట సర్పంచ్ గాజుల బాబు, రైతులు ఉన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన…
అక్కన్నపేట, మే 18 : మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీవో కొప్పుల సత్యపాల్రెడ్డి సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. వర్ష సూచన నేపథ్యంలో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తరలించే విధంగా ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఎంపీడీవో వెంట సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఏఈవో సబియా, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు.