పట్నా : సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఐదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లో వెలుగుచూసింది. సివన్ జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం బాలిక ఇతర చిన్నారులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా ఇద్దరు మైనర్ బాలురు బాధితురాలిని సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
బాలిక ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయం తల్లికి వివరించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. నిందితులను తక్షణమే తమకు అప్పగించాలని నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు హెచ్చరించడంతో ఓ బాలుడిని పోలీసులకు అప్పగించారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నామని స్ధానిక మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ప్రమీల కుమారి వెల్లడించారు.