హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ చొరవతో తలసేమియా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. తలసేమియా రోగులకు సరైన సమయానికి రక్తమార్పిడి ఎంత ముఖ్యమో తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఈ పాస్ విషయంలో ఎదురైన ఇబ్బందిని జీపీ సింగ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ తన బాధను పంచుకున్నారు.
నా మనవరాలు తలసేమియా బాధితురాలు. పూణేలోని దీననాథ్ మంగేస్కర్ ఆస్పత్రిలో సాధారణ రక్త మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్నాం. తనకు ఈ నెల 23వ తేదీన రక్తమార్పిడి జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈ పాస్ అప్లై చేస్తే నిరాకరించారు. తనకి రక్తం సకాలంలో ఇవ్వకపోతే చాలా ప్రమాదం. ఈ విషయమై వివరాలు తెలియజేస్తూ నా కోడలు మళ్లీ ఈ పాస్ కోసం దరఖాస్తు చేసింది. దయచేసి ఈ పాస్ ఇప్పించగలరని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ తలసేమియా వ్యాధిగ్రస్తులను ప్రత్యేక పరిస్థితులుగా గుర్తించి పాస్లు జారీ చేసే విషయంలో సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. తక్షణం స్పందించిన డీజీపీ అన్ని మెడికల్ ఎమర్జెన్సీలను ఈ పాస్ పోర్టల్, తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైట్ ద్వారా సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సమన్వయం చేసుకునేలా, సమస్యలు పరిష్కరించేలా అందరి అధికారులను ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడమైందని తెలిపారు.