యాదాద్రి భువనగిరి : కరోనా విజృంభణ నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో తాత్కాలికంగా ఆర్జిత సేవలను నిలిపివేశారు. రేపట్నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆర్జిత సేవలు, అన్నప్రసాదం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
భక్తులు లేకుండానే ఏకాంతంగా దైవారాధనలు నిర్వహించనున్నారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు యాదాద్రిలో 73 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 463 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కు పెరిగాయి. కొత్తగా 364 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,00,83 మంది కోలుకున్నారు. మరో నలుగురు వైరస్ ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,694కు పెరిగింది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 97.92శాతం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,723 హోం ఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 42,461 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 145, మేడ్చల్ మల్కాజ్గిరిలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్లో 23, జగిత్యాలలో 20, వరంగల్ అర్బన్లో 19 అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..