సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని నార్సింగిలో రూ.3.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎండీ రఘుమారెడ్డి అధికారులతో పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్తో నార్సింగి, అల్కాపురి, పుప్పాల్గూడ ప్రాంతాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు వీలవుతుందని తెలిపారు. వంగిన, తప్పు పట్టిన, పాడై పోయిన స్తంభాలను మార్చి, దెబ్బతిన్న స్టే వైర్లను మార్పిడి చేయాలని అధికారులకు సూచించారు.
వీధి దీపాలకు ప్రత్యేక మీటర్లు, బాక్సులు ఏర్పా టు చేయడం వంటివి చేసి, మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా చూడాలన్నారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ భావితరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించాలనే దూరదృష్టితో పనిచేస్తున్నారని, అందులో అందరూ భాగస్వాములు కావాలన్నా రు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సబ్ స్టేషన్లు, కార్యాలయాల్లో దాదాపు 2లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు.
తమ శాఖలో పరిధిలో దాదాపు 20,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రతి ఉద్యోగి తమ కుటుం బం తరపున ఆరు మొక్కలు నాటాలని, అలా జరిగితే, దాదాపు 1.25 లక్షల మొక్కలు భావితరాల వారికి మంచి ఆహ్లాదకర వాతావరణం బహుమానంగా ఇచ్చినట్లవుతుందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటికి నీరు, ఎరువులు వేసి చక్కగా పెరిగేలా చూడాలని సీఎండీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ రెడ్డి, కె.రాములు, జి.పర్వతం, సీహెచ్ మదన్మోహన్ రావు, ఎస్.స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.