న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ దేశంలో 47.5 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఒక రోజులో ఇచ్చిన అత్యధిక వ్యాక్సిన్ డోసుల రికార్డు ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు రోజులో అత్యధిక వ్యాక్సిన్ల రికార్డు 43 లక్షలుగా ఉంది. ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాల్లో వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు.
దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే ఈ రాష్ట్రాల్లో 23 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక జులై, ఆగస్ట్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అన్న మోదీ నిర్ణయంతో ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనున్నట్లు చెప్పారు.