కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. తాజాగా ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాటని విడుదల చేయడం విశేషం.
11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని ఇళయ రాజా పాట రూపంలో మలచగా, ఆ పాటని అమితాబ్ షేర్ చేస్తూ.. భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు.. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు, మ్యాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట ఆకట్టుకుంటుంది. 1995 జూన్ 15 ‘పెదరాయుడు’ రిలీజైన 26 సంవత్సరాల తర్వాత 2021 జూన్ 15న ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కానుండటం శుభసూచకంగా భావిస్తున్నాను అని మోహన్ బాబు రీసెంట్గా ట్వీట్లో పేర్కొన్న విషయం విదితమే.