యాంగోన్: మయన్మార్లో మరోసారి రక్తం ఏరులై పారింది. శనివారం నాటి పోలీస్ కాల్పుల్లో 90 మందికిపైగా మరణించారు. మాండలేలో 13 ఏండ్ల బాలికతో సహా కనీసం 29 మంది మృతి చెందారని, యాంగోన్లో కనీసం 24 మంది మరణించారని మయన్మార్ నౌ తెలిపింది. సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలో మరణించిన వారిలో 13 ఏండ్ల బాలుడు ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1 సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిత్యం నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ప్రజా నిరసనలను సైన్యం అణచివేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 300 మందికిపైగా మరణించినట్లు సమాచారం.