మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికకు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న ఈ జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.250 కోట్ల నిధులను వెచ్చించేందుకు ఉద్యానవనశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం 4వేల ఎకరాల్లో పంట సాగు అవుతుండగా.. త్వరలో 36వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లను సాగును చేయనున్నారు.. ఇందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు..పంటలసాగుపై వారికి అవగాహన కల్పించనున్నారు.. ఇక్కడ పండించిన పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సంబంధిత అధికారులు సహాయసహకారాలు అందించనున్నారు.
మేడ్చల్ జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు రూ. 250 కోట్ల నిధులను వినియోగించేందుకు కార్యరూపాన్ని అధికారులు సిద్ధం చేశారు. కూరగాయలు, పండ్లు సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు ప్రోత్సాహం అందించి.. వారికి అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న భూములను సాగులోకి తేవడం, వివిధ కూరగాయలు, పండ్లసాగుకు అవసరమయ్యే పందిళ్లు, వివిధ రకాల వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లను సబ్సిడీ రుణాలపై అందించనున్నారు.
జిల్లాలో కూరగాయలు, పండ్లు సాగుచేసే రైతులతో సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఉద్యానవనశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. సంఘాల ఏర్పాటు అనంతరం రైతులకు అందించే సౌకర్యాలను వివరించనున్నారు. పండించిన కూరగాయలు, పండ్లను విక్రయించేందుకు మార్కెటింగ్ తదితర సౌకర్యాలను వెల్లడించనున్నారు. పంటల సాగులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉద్యానవన అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే మేడ్చల్లో పండించిన కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతులు చేసే రైతులకు తగిన ప్రోత్సాహం అందించనున్నారు. విదేశాలకు ఎగుమతులు జరిగితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైతులు మరింత అభివృద్ధి చెందేందుకు కూరగాయల ఎగుమతులకు పరిశ్రమల, వాణిజ్యశాఖలు పూర్తి సహాయ సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం విధితమే.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 4 వేల ఎకరాల్లో వివిధ కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నారు. పండించిన కూరగాయలను హైదరాబాద్ మార్కెటింగ్కు తరలిస్తున్నారు. నగర ప్రజలకు కూరగాయల కొరత లేకుండా మేడ్చల్ జిల్లాలో పండించిన కూరగాయలను తరలిస్తున్నారు.
జిల్లాను హార్టికల్చర్హబ్గా తీర్చిదిద్దే ప్రణాళిక త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 36 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లను సాగును చేసేందుకు రైతులను సన్నద్దం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హార్టికల్చర్హబ్గా తీర్చిదిద్దేందుకు రూ. 250 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాం. రైతు సంఘాలను ఏర్పాటు చేసి కూరగాయలసాగుపై పూర్తి అవగాహన కల్పించి.. మార్కెటింగ్ సౌకర్యాలను వివరిస్తాం. కూరగాయల సాగు చేసే రైతులకు వ్యవసాయ పరికరాలు, పందిళ్లు, ట్రాక్టర్లను సబ్సిడీ రుణాలపై ప్రభుత్వం అందించనుంది. – సత్తార్, మేడ్చల్ జిల్లా ఉద్యానవనశాఖ అధికారి