హైదరాబాద్, జూన్ 18,(నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున్నది. నాసిరకం విత్తనాల పీడ నుంచి అన్నదాతలకు విముక్తి కల్పించేందుకు నకిలీ మోసగాళ్లపై దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. నాసిరకం విత్తన ముఠాల బెడద ఎక్కువగా ఉన్న వెస్ట్జోన్ పరిధిలో స్థానిక పోలీసులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ బృందాలు ఫోకస్ పెంచాయి. దీంతో ఈ జోన్ పరిధిలోని జిల్లాల్లో పట్టుబడ్డ మొత్తం కల్తీ విత్తనాల విలువ రూ. 27,12,96,000 ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. జోన్ పరిధిలోని అన్ని జిల్లాల్లో కలిపి శుక్రవారంనాటికి 141 కేసులు నమోదయ్యాయి. 196 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 47 కేసులు నమోదుకాగా, 19 మందిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్లో 28 కేసుల్లో 8 మంది, సూర్యాపేటలో 5 కేసుల్లో 20 మంది పట్టుబడ్డారు. శుక్రవారం నల్లగొండలో పట్టుబడిన నకిలీ విత్తనముఠా నుంచి రూ.6కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ విత్తనాల పట్టివేతతో వేలాది ఎకరాలను పోలీసులు కాపాడారు. ముఠాలను కట్టడి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నుంచి అభినందనలు వచ్చినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
సిబ్బందికి డీజీపీ అభినందన
నల్లగొండ పోలీసులు శుక్రవారం రూ.6కోట్ల విలువైన 200 టన్నుల నాసిరకం విత్తనాలను పట్టుకొన్నందుకు డీజీపీ ఎం మహేందర్రెడ్డి సిబ్బందిని అభినందించారు. వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్వ్రీంద్ర, నల్లగొండ ఎస్పీ రంగనాథ్తోపాటు ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.