న్యూఢిల్లీ, జూన్ 10: ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సిలిండర్ కోసం ఏజెన్సీకి ఫోన్ చేయాల్సి ఉంది.. కానీ ఆ సంస్థ సేవలుగానీ, సిలిండర్ను తీసుకొచ్చే వారు ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేయటంగానీ నచ్చటం లేదు. అయినా తప్పదు కదా అనుకుంటూ మళ్లీ అదే ఏజెన్సీకి ఫోన్ చేశారు. ఇకపై ఇలా సర్దుకుపోవాల్సిన అవసరంలేదు. వినియోగదారులు తమకు నచ్చిన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ (గ్యాస్ ఏజెన్సీ) దగ్గరి నుంచి సిలిండర్ను తెప్పించుకునే అవకాశాన్ని కల్పించే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
ఈ మేరకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ‘ఎల్పీజీ రీఫిలింగ్ కోసం కస్టమర్లు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకునే వెసులుబాటును త్వరలో తీసుకురాబోతున్నాం. చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పుణె, రాంచీలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం’ అని వెల్లడించింది. అనంతరం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామన్నది. ఈ విధానం కస్టమర్లకు మెరుగైన సేవలు లభించటం కోసమేగాక, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగడానికి దోహద పడుతుందని వివరించింది.
మరోవైపు, ప్రభుత్వ ఈ-సర్వీస్ డెలివరీకి చెందిన కామన్ సర్వీస్ సెంటర్ ప్రోగ్రామ్ (సీఎస్సీ ఎస్పీవీ) ద్వారా దేశవ్యాప్తంగా 21 వేల ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ప్రారంభించినట్టు సీఎస్సీ ఎస్పీవీ ఎండీ దినేశ్ త్యాగి తెలిపారు. దీనికోసం హెచ్పీసీఎల్, ఐవోసీ వంటి ప్రభుత్వ చమురు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు.
ఎలా బుకింగ్ చేయాలి?
ఎల్పీజీ రీఫిలింగ్ కోసం సంబంధిత కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ అవ్వాలి.
మీ నివాసప్రాంతం పరిధిలోకి వచ్చే డిస్ట్రిబ్యూటర్ల (గ్యాస్ ఏజెన్సీల) జాబితా కనిపిస్తుంది.
ఆయా డిస్ట్రిబ్యూటర్ల పనితీరుకు ప్రజలు ఇదివరకు ఇచ్చిన రేటింగ్ కూడా ఉంటుంది.
నచ్చిన డిస్ట్రిబ్యూటర్ పక్కనున్న బుకింగ్ ఐకాన్పై క్లిక్ చేసి రీఫిలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలి.