రెండు జాతీయ రహదారులను కలుపుతూ ప్రతిపాదన
హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు 234 కిలోమీటర్ల మేర హైవే
త్వరలో రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభం
సర్వే ప్రారంభించిన ‘నేషనల్ హైవే’ అధికారులు
ఇల్లెందు, ఏప్రిల్ 9: భద్రాద్రి జిల్లావాసులు ‘భాగ్యనగరానికి’ వెళ్లాలంటే ఇబ్బంది పడనక్కర్లేదు.. వ్యయప్రయాసల కోర్చి రెండుమూడు చోట్ల బస్సు ఎక్కి దిగాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్ సమీపంలోని వలిగొండ నుంచి కొత్తగూడెం వరకూ నిర్మిస్తున్న జాతీయ రహదారితో ఇక ప్రయాణ ఇక్కట్లు తప్పనున్నాయి.. ఇల్లెందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ‘మార్గం’ సుగమమైంది. ‘రహదారులే ప్రగతికి సోపానాలు’ అన్న నానుడిని నమ్మి సీఎం కేసీఆర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందన వచ్చింది.. ఇటీవల ఈ జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రూ.2 వేల కోట్లతో 234 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగనున్నాయి. దీంతో జిల్లా మరింత అభివృద్ధి చెందనుంది.
తెలంగాణకు మరో జాతీయ రహదారిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన విధంగా హైదరాబాద్ సమీపంలోని వలిగొండ- కొత్తగూడెం జాతీయ రహదారి (ఎన్హెచ్ 930- పి) నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. ఈ రహదారితో కొత్తజిల్లాగా ఆవిర్భవించిన భద్రాద్రికి కూడా మేలు జరుగనుంది. వ్యవసాయ, పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో దూసుకెళ్తున్న జిల్లాకు ప్రభుత్వం నుంచి మరో తీపికబురు అందింది. హైదరాబాద్ – ఛత్తీస్గఢ్ – భూపాల్ పట్నం వయా ఏటూరునాగారం జాతీయ రహదారి, విజయవాడ – జగ్దల్పూర్ వయా కొత్తగూడెం జాతీయ రహదారిని కలుపుతూ మరో కొత్తజాతీయ రహదారి నిర్మాణానికి ఇటీవల కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఈ రహదారి వలిగొండ నుంచి మొదలై వయా తొర్రూర్, మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం క్రాస్రోడ్డు వరకు రహదారి అందుబాటులోకి రానుంది. 234 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. కేంద్రానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే నేషనల్ హైవే విభాగ అధికారులు ఇందుకు సంబంధించిన సర్వే చేపడుతున్నారు. కిలోమీటర్కు రూ.8 కోట్ల చొప్పున సుమారు రూ.2 వేల కోట్లతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతులు మంజూరు చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ జాతీయ రహదారి కోసం అనేక విధాలుగా కృషి చేశారు.
భద్రాద్రి జిల్లాలో 52 కిలోమీటర్లు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హైదరాబాద్ – కొత్తగూడెం జాతీయరహదారి 52 కిలోమీటర్ల మేర ఉంటుంది. కొత్తగూడెం క్రాస్ రోడ్డు నుంచి ఇల్లెందు వరకు 38 కిలోమీటర్లు, ఇల్లెందు నుంచి బయ్యారం మండల సరిహద్దులోని నామాలపాడు శివారు వరకు 14 కిలోమీటర్ల మేర రహదారి అందుబాటులోకి రానుంది. 14 మీటర్ల వెడల్పు(వంద ఫీట్ల)తో రోడ్డు విస్తర్ణ జరుగనుంది. మధ్యలో సెంట్రల్ డివైడర్తో పాటు రెండువైపులా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన సర్వేను ఇప్పటికే నేషనల్ హైవే (ఎన్హెచ్) అథారిటీ అధికారులు ప్రారంభించారు.
ఇల్లెందుకు బైపాస్ రోడ్డు
జాతీయ రహదారి మంజూరైన నేపథ్యంలో ఇల్లెందులో బైపాస్ రోడ్డు విస్తరణ జరుగనుంది. బైపాస్లో రోడ్డును మళ్లించే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇల్లెందు గోవింద్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, సత్యనారాయణపురం, సుదిమళ్ల నుంచి ఇల్లెందు- కొత్తగూడెం రహదారి మళ్లించే విధంగా ప్రతిపాదనలు ఉంటాయని తెలిసింది. ఇల్లెందు – మహబూబాబాద్ రోడ్డులోని స్ట్రట్ఫీట్ బస్తీ నుంచి కోల్ ట్రాన్స్పోర్ట్ బైపాస్ మీదుగా, డీబ్లాక్ నుంచి కరెంట్ ఆఫీస్కు వెళ్లే విధంగా మరో ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది.
మరింత అభివృద్ధి జరుగుతుంది..
నూతనంగా మంజూరైన జాతీయ రహదారితో మరింత అభివృద్ధి జరగనుంది. వివిధ జిల్లాల నుంచి భద్రాద్రి జిల్లాకు వచ్చే ఈ రహదారి కోసం రాష్ట్రప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్ రూట్మ్యాప్ను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొత్తజాతీయ రహదారి కొత్త జిల్లా కేంద్రాలను కలుపుతూ హైదరాబాద్కు అనుసంధానంగా ఉంటుంది. కొత్తగూడెం, మహబూబాబాద్, భూవనగిరి జిల్లాలను ఈ జాతీయ రహదారి కలుపుతుంది.
-బానోత్ హరిప్రియానాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే
ఇవి కూడా చదవండి
41 సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?