ఎల్లారెడ్డి రూరల్, మార్చి 27 : ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ మన రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలకేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్హాలులో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తన సొంత డబ్బులతో చీరెలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు నూతన శోభను సంతరించుకున్నాయన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణానికి 300 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని రాధావిఠల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, నాగిరెడ్డిపేట్ జడ్పీటీసీ మనోహర్రెడ్డి, నాగిరెడ్డిపేట్ తహసీల్దార్ సయీద్ అహ్మద్ మస్రూర్, ఎంపీటీసీ పడమటి సంతోష్కుమార్, టీఆర్ఎస్ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు జలంధర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలో ఫంక్షన్ హాలు వద్ద కాంగ్రెస్ నాయకులు నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించగా.. ఎస్సై రాజశేఖర్ వారిని అదుపులోకి తీసుకున్నారు.
లింగంపేట, మార్చి 27: మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 126 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, జడ్పీటీసీ సభ్యురాలు ఏలేటి శ్రీలత, ఏఎంసీ చైర్మన్ బోయిని రాధ, లింగంపేట సర్పంచ్ బొల్లు లావణ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, వైస్ చైర్మన్ మాకం రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండల హోధ్యక్షుడు సర్వన్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
గాంధారి, మార్చి 27 : మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 146 మందికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మమ్మాయి సంజీవ్, ఏఎంసీ చైర్మన్ పెద్దబూరి సత్యం పాల్గొన్నారు.
సదాశివనగర్లో..
సదాశివనగర్, మార్చి 27 : మండలకేంద్రంలో సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సురేందర్ కల్యాణలక్ష్మి చెక్కులు, చీరెలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు గైని అనసూయ, నారెడ్డి దశరథ్ రెడ్డి, జడ్పీటీసీ కమిలి నర్సింహులు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్రావు, విండో అధ్యక్షులు సదాశివరెడ్డి, కమలాకర్ రావు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో అశోక్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
టీఆర్ఎస్ సదాశివవగర్ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్ తండ్రి గడీల నర్సయ్య ఇటీవల మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే సురేందర్ పరామర్శించారు. తిర్మన్పల్లి గ్రామానికి చెందిన పైడి జగన్రెడ్డి కుటుంబసభ్యులను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు..
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సదాశివనగర్లో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో రైతువేదిక భవనాలను నిర్మించామని తెలిపారు. కొత్తగా 10 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎల్లారెడ్డి చెరువుకట్టపై రూ. 10 కోట్ల నిధులతో రోడ్డు, ఎల్లారెడ్డి పట్టణంలో డివైడర్, ఎల్ఈటీ లైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ. 12 కోట్ల ఎంపీ నిధులతో కుప్రియాల్, ధర్మారావుపేట్, మోడెగామ గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మూడేండ్లుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు వివరించారు.