అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప’ చిత్రానికి సంబంధించిన తొలిపాట ‘దాక్కో దాక్కో మేక..’ శుక్రవారం విడుదలైంది. ప్రతి జీవి ప్రాకృతిక ధర్మంగా ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని..ఈ క్రమంలో బలవంతులే గెలుస్తారని..చివరగా కాలం అందరిని తనలో కలిపేసుకుంటుందనే తాత్విక భావనతో చంద్రబోస్ ఈ పాటను రచించారు. శివం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. ‘వెలుతురు తింటది ఆకు..ఆకును తింటది మేక’..‘మేకను తింటది పులి..ఇది కదరా ఆకలి’..‘పులినే తింటది చావు..చావును తింటది కాలం’..‘కాలాన్ని తింటది ఖాళీ..ఇది మహా ఆకలి…’ అంటూ సాగే ఈ పాటలో హీరో అల్లు అర్జున్ రఫ్ లుక్లో కనిపించారు. నోటిలో కత్తి పెట్టుకొని ఆయన చేసిన నృత్యాలు అభిమానుల్ని అలరించేలా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఈ గీతాన్ని ఆలపించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రానుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. తొలిభాగం ‘పుష్ప-ది రైజ్’ క్రిస్మన్ సందర్భంగా విడుదలకానుంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, సీఈఓ: చెర్రీ, నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, దర్శకుడు: సుకుమార్.