ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ
న్యూఢిల్లీ, జూన్ 25: గర్భిణులు కరోనా టీకా వేసుకోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ శుక్రవారం తెలిపారు. పిల్లలకు టీకా వేయాలా.. వద్దా… అన్న దానిపై మరింత పరిశోధనలు, విశ్లేషణ జరుగాల్సి ఉందన్నారు. గర్భిణులకు టీకాపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం అమెరికాలోనే పిల్లలకు టీకాలు వేస్తున్నారని భార్గవ పేర్కొన్నారు. బాగా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అవసరమా.. కాదా.. అన్న అంశం ఇప్పటికీ ప్రశ్నగానే ఉందని చెప్పారు. ఇండియాలో 2-18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్పై పరిశోధనలు, అధ్యయనం జరుగుతున్నదని, సెప్టెంబర్-అక్టోబర్లో ఫలితాలు రావొచ్చని చెప్పారు.
డెల్టాప్లస్పై వారంలో తేలనున్న వ్యాక్సిన్ సామర్థ్యం
ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషీల్డ్లు సమర్థంగా పనిచేస్తున్నాయని డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. కొత్తగా వెలుగుచూసిన డెల్టా ప్లస్ పైనా ఈ రెండు వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయనేది పరిశీలిస్తున్నామని.. వచ్చే వారం, పదిరోజుల్లో ఆ విషయం తెలిసిపోతుందని చెప్పారు. భారత్లో ప్రస్తుతం పది రాష్ర్టాలలో 48 డెల్టాప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని చెప్పిన భార్గవ.. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని సూచించారు.