ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటు
ఉపాధిహామీ పథకం ద్వారా 4.84లక్షల మొక్కల పెంపకం
హరితహారం కింద నాటేందుకు చర్యలు
మండలంలోని 44 పంచాయతీల్లో మొక్కల సంరక్షణ
కులకచర్ల, మార్చి 29 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసింది. వీటిలో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. 7వ విడుత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఊరుకొక నర్సరీని ఏర్పాటు చేసి, మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి పర్యవేక్షణకు గ్రామ సర్పంచులు, ఉపాధిహామీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రసహాయకులు దృష్టిసారించారు. ప్రతి గ్రామంలో ఉండే సేవకులకు నెలకు రూ.5125 వేతనం అందిస్తున్నారు. నర్సరీల్లో సాధారణ మొక్కలతో పాటు పండ్లు, పూలు, వివిధ రకాల 11వేల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.
44గ్రామ పంచాయతీల్లో..
మండలంలోని 44 గ్రామ పంచాయతీల్లో మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. పల్లెపల్లెకూ నర్సరీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా విరివిగా మొక్కలు నాటేందుకు ఉపాధిహామీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ నిర్వాహకుడిని నియమించారు. ఉపాధిహామీ ద్వారా కూలీలకు నర్సరీల్లో పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. మండలంలో 44 గ్రామ పంచాయతీల్లో 2021-22 సంవత్సరానికి గాను 4.84లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
11వేల మొక్కల చొప్పున..
కులకచర్ల మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 11వేల చొప్పుల మొక్కలను పెంచుతున్నారు. దీంతో నర్సరీల్లో మొలకెత్తని వాటి స్థానంలో మొక్కల విత్తనాలు విత్తుతున్నారు.
ప్రతి రోజూ రెండుసార్లు నీళ్లు…
ఉదయం, సాయంత్రం రెండు సార్లు మొక్కలకు నీళ్లు అందిస్తున్నారు. దీంతో గ్రామాల్లో నర్సరీల్లో మొక్కలు మొలకెత్తే దశలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో పచ్చదనమే లక్ష్యంగా ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని చేపడుతున్నది.