న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేస్తున్నారు. అయితే, ఈ టీకాలు తీసుకున్న తర్వాత అక్కడక్కడ కొంతమంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్లో హృదయసంబంధ రోగాలతో బాధపడుతున్న ఇద్దరు వృద్ధులు కొవిడ్ టీకా తీసుకున్న కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
డార్జిలింగ్కు చెందిన పారుల్ దత్తా (75) అనే మహిళ ఈ నెల 8న మధ్యాహ్నం 3.30 గంటలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నది. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికివెళ్లింది. అయితే, సాయంత్రం ఆరు గంటలకల్లా వాంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఖారిబారి బ్లాక్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అటునుంచి నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9.30 గంటలకు ఆమె మృతిచెందారు. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం ద్వారా ఆమె మృతిచెందారని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
మరో ఘటనలో జల్పాయ్గురి జిల్లా ధూప్గురికి చెందిన క్రిష్ట దత్తా (65) అనే వృద్ధుడు కూడా ఈ నెల 8న ఉదయం 10.50 గంటలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి అవలక్షణాలు లేకుండా సజావుగానే ఇంటికి చేరుకున్న వృద్ధుడికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాంతులు అయ్యాయి. ఆ తర్వాత బాగానే ఉండటంతో ఎప్పటిలాగే ఆ రాత్రికి నిద్రపోయాడు. కానీ తెల్లవారుజామున 5 గంటలకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి విలవిల్లాడుతూ అరగంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు.
అయితే, ఈ రెండు కేసుల్లోనూ బాధితులు గత కొంతకాలంగా హృదయసంబంధ రోగాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. పారుల్ దత్తా గత కొన్నిరోజులుగా హృద్రోగానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని, అదేవిధంగా క్రిష్ణదత్తా ఐదేండ్లుగా హైబీపీతో బాధపడుతున్నాడని చెప్పారు. అయితే టీకా తీసుకున్న అనంతరం వారు మృతిచెందడానికి కచ్చితంగా టీకానే కారణమా..? వారి అనారోగ్యాలే కారణమా..? అనే దానిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని, ఆ ఇన్వెస్టిగేషన్లో అసలు వాస్తవాలు తెలుస్తాయని పశ్చిమబెంగాల్ ఆరోగ్యసేవల డైరెక్టర్ అజయ్ చక్రవర్తి చెప్పారు.