సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్, మార్చి 19 : సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు స్థానిక సంస్థలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై వివక్ష చూపితే.. స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ చొరవతో మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారి అలుగుపోస్తున్న సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ పెద్ద చెరువును సందర్శించి.. గంగమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే, రా్రష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కడుపు నింపిందన్నారు. సమైక్య రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయని మంత్రి గుర్తుచేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రూ.300 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు, వైకుంఠధామాల నిర్మాణాలకు రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని హరీశ్రావు తెలిపారు.