మహబూబాబాద్: రైతులకు అవసరమైన సాగునీరందిస్తూ.. అదనపు ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో సాగునీటి ప్రణాళికపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో 737 చెరువులు నింపేందుకు తీసుకున్న చర్యలపై మంద్రి వివరిస్తూ.. డోర్నకల్ నియోజకవర్గంలో 180, మహబూబాబాద్ నియోజకవర్గంలో 292, మహబూబాబాద్ లో 180, తొర్రురు 66 చెరువులకు 37 చెరువులు ఎస్సారెస్పీ కాలువలు, యూటీలు, గొలుసు కట్టు ద్వారా నింపేందుకు అవకాశముందన్నారు. మిగతా చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఎస్సారెస్పీ పెండింగ్ పనులను చేపట్టాలని కోరుతున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా విధంగా చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపేందుకు పనులు ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.