పారిస్,జూలై : గూగుల్ కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 500 మిలియన్ యూరోలు (రూ.4,415 కోట్లు) విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. పలు దేశాలు డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఫ్రాన్స్ గూగుల్ కు ఫైన్ వేసింది. న్యూస్ పబ్లిషింగ్ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ ఫైన్ విధించింది.
వార్తా సంస్థలు గూగుల్ మధ్య చాలా కాలంగాకోల్డ్ వార్ జరుగుతున్నది. అయితే తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటనల ఆదాయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక డిజిటల్ చట్టాల్ని అమలుచేస్తున్నాయి. వివిధ మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్కు కొంత గడువు కూడా ఇచ్చాయి.
ఈ క్రమంలో ఫ్రాన్స్ యాంటీ ట్రస్ట్ ఏజెన్సీ సైతం స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని గూగుల్కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్ జాప్యం చేసిందని తద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపిస్తున్నది ఫ్రాన్స్.