మండుతున్న ఎండలు.. నడుస్తున్న ఏసీలు, ఫ్రిజ్లు
వ్యవసాయరంగంలోనూ పెద్దసంఖ్యలో మోటర్లు
గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా వాడకం
వినియోగం 40 శాతం పెరిగినా నిరంతరాయంగా విద్యుత్
కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉమ్మడి జిల్లాకు వరంలా మారింది. ఎక్కడ చూసినా పుష్కలమైన నీళ్లు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువమానేరు వరకు జలాశయాలు నిండుగా దర్శనమిస్తున్నాయి. శ్రీ రాజరాజేశ్వర, లోయర్ మానేరు జలాశయాలు, వరదకాలువ, రోళ్లవాగు, రాళ్లవాగు, బొగ్గుల వాగుతోపాటు దాదాపు ప్రతి చెరువులో నీరు పుష్కలంగా ఉండడం.. భూగర్భ జలాలు పైపైకి రావడం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 3.66 లక్షల పైచిలుకు వ్యవసాయ పంపు సెట్లు ఉండగా, జగిత్యాల జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి.
సాధారణ విస్తీర్ణానికి 40 శాతం అదనంగా..
ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.64 లక్షలు కాగా, ప్రస్తుత సీజన్లో 9.87 లక్షల ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో సాధారణ పంటల విస్తీర్ణం 1.68 లక్షల ఎకరాల పైచిలుకు ఉండగా.. 2.79 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జగిత్యాలలో 1.90 లక్షలు కాగా, 3.34 లక్షలు.. పెద్దపల్లిలో 1.29 లక్షలు కాగా, 2.05 లక్షలు.. సిరిసిల్ల జిల్లాలో 76 వేల పైచిలుకు సాధారణ విస్తీర్ణం కాగా, 1.68 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా సాధారణ విస్తీర్ణం కన్నా 40 శాతం అదనంగా సాగు పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే బోర్లు, మోటర్ల వాడకం పెరిగింది. ఇటు ఎండలు దంచి కొడుతుండడంతో కూలర్లు, ఏసీలు రాత్రి పగలు తేడా లేకుండా నడుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగింది.
ఆయా జిల్లాల వారీగా వివరాలు..
పెద్దపల్లి జిల్లా : గత ఏప్రిల్లో రోజు వారీగా డిమాండ్ 255.5 మెగావాట్లు ఉండేది. ప్రస్తుతం 334.8 మెగావాట్లకు పెరిగింది. రోజుకు 79.3 మెగావాట్లు అదనంగా ఉన్నది. జిల్లాలో 69,485 వ్యవసాయ కనెక్షన్లు, 1,96,114 గృహ కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశాలుండగా.. భవిష్యత్లో వచ్చే డిమాండ్ తట్టుకునేందుకు వీలుగా.. క్షేత్రస్థాయిలో 93.52 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా : పోయినేడు ఏప్రిల్లో 5న 492.76 మెగావాట్ల వినియోగం ఉండగా, ఈ ఏప్రిల్ 5న 596.09 మెగావాట్ల వినియోగం జరిగింది. గతంతో పోలిస్తే రోజుకు సరాసరి 103.33 మెగావాట్ల వినియోగం పెరిగింది. జిల్లాలో 4,12,504 గృహ కనెక్షన్లు, 98,368 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
జగిత్యాల జిల్లా : గతేడాది ఏప్రిల్లో డిమాండ్ 96.93 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా.. ఈ యేడాది డిమాండ్ 97.96 ఎంయూగా ఉన్నది. జిల్లాలో 3,12,031 గృహ కనెక్షన్లు, 41,974 గృహేతర కనెక్షన్లు, 1,28,988 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏప్రిల్లో రోజు వారీగా కేటాయించిన వాటా 3.27 మిలియన్ యూనిట్లు కాగా.. సరాసరి 5.536 ఎంయూ వినియోగం ఉన్నది. డిమాండ్ను తట్టుకునేందుకు వీలుగా.. 5.12 కోట్లు ఇప్పటికే వినియోగించగా మరిన్ని పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ జిల్లాలో విద్యుత్ వినియోగం పోయినేడు ఏప్రిల్లో 104 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ యేడాది 116 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. అంటే 12 మిలియన్ యూనిట్లు వినియోగం పెరిగింది. ఇంకా ఈ వినియోగం ఈ నెలాఖరు వరకు 120 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో లక్షా 52 వేల గృహ కనెక్షన్లు, 1,370 పరిశ్రమలు, 5,400 మరమగ్గాలు, 70 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. డిమాండ్ను తట్టుకునేందుకు సెస్ పరిధిలో పెద్దూరులో 70 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేశా రు. 33/11 కేవీ సబ్స్టేషన్లు గతంలో 35 ఉండగా 70కి పెంచారు. ఇంకాచాలా చోట్ల ఆధునీకరణ పనులు చేస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షణ
ఈ నెలాఖరు వరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు.. వంటి విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గంటగంటకూ పెరుగుతున్న డిమాండ్ను నమోదు చేస్తూ.. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎక్కడా అంతరాయం కలుగనివ్వకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తున్నారు.