రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులకు కరోనా పరీక్ష నిర్వహించగా 23 మందికి పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. అయితే వారికి సోకిన కరోనా భారత్లో కలకలం రేపుతున్న వేరియంటా కాదా అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇటలీకి ప్రయాణ ఆంక్షలను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ మరింత కఠినం చేసింది. భారత్ నుంచి ఇటలీ పౌరులను మాత్రమే అనుమతిస్తామని గురువారం తెలిపింది. అయితే వారు కరోనా పరీక్ష చేయించుకోవడంతోపాటు తప్పని సరిగా ఐదు రోజులు స్వీయ ఐసొలేషన్లో ఉండాలని పేర్కొంది. భారత్తోపాటు, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ఐరోపా దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనలను మే 15 వరకు పొడిగించినట్లు ఇటలీ వెల్లడించింది.