హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): అనుమతులు లేకుండా దొడ్డిదారిలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్) పర్యావరణానికి ప్రమాదంలా మారుతున్నదా? వన్యప్రాణుల మనుగడకు ముప్పులా పరిణమిస్తున్నదా? అపార వనసంపద నేలకొరగనున్నదా? అంటే అవునని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖరాసింది. ఈ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందని, వన్యప్రాణులకు ఉనికే ప్రమాదకరంగా మారుతుందని లేఖలో పేర్కొన్నది. అక్రమంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశాన్ని చర్చకు కూడా స్వీకరించరాదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ)-రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్కు రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్కుమార్ లేఖ రాశారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చేపడుతున్న ఈ పనులపై కేంద్రం సీరియస్గా దృష్టి సారించాలని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని విస్తరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే ఆపాలని విజ్ఞప్తిచేశారు. ఈఏసీ ప్రచురించిన ఎజెండాలో ఆర్ఎల్ఐఎస్తో పాటు పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాలను చేర్చటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అనుమతి లేని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా ఇప్పటికే ఏపీ సర్కారు కృష్ణానది నుంచి భారీమొత్తంలో నీటిని నిబంధనలకు విరుద్ధంగా బేసిన్ అవతలికి తరలిస్తున్నదని వెల్లడించారు. ఆర్ఎస్ఐఎస్ కింద కాలువలను అడవులు, అభయారణ్యాలు, ఎకో-సెన్సిటివ్ జోన్ల మీదుగా నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని మ్యాప్తో సహా ఆయన వివరించారు.
కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సమర్పించకుండా, బోర్డు అనుమతి లేకుండా ఆర్ఎల్ఐఎస్ పథకం కింద పనులను చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయాన్ని లేఖలో స్పష్టంచేశారు. గత అక్టోబర్లో కేంద్ర జలవనరులశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో ఆర్ఎల్ఐఎస్ పనులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. అనుమతి లేని ఆ ప్రాజెక్ట్ను విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే ఆపాలని రజత్కుమార్ కేంద్రాన్ని కోరారు.
పర్యావరణానికి ప్రమాదం.. వన్యప్రాణులకు గండం
రాయలసీమ ఎత్తిపోతల వల్ల అడవులకే కాకుండా అభయారణ్యాలలోని వన్యప్రాణులకు ప్రమాదం పొంచిఉన్నదని రజత్కుమార్ తన లేఖలో వివరించారు. పనులు జరిగే మార్గంలో పలు అభయారణ్యాలు, శ్రేష్టమైన అటవీ సంపద ఉన్నదని తెలిపారు. రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంక మల్లేశ్వరం, పెనుశిల నరసింహ, రాజీవ్గాంధీ నేషనల్ పార్క్, వెంకటేశ్వర జాతీయ పార్కులు ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ఆర్ఎల్ఐఎస్ కింద తవ్వే కాలువలకు ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని వెల్లడించారు. కాలువల అలైన్మెంట్ అభయారణ్యాల బఫర్ జోన్ నుంచే కాకుండా కోర్ జోన్ నుంచి కూడా ఉన్నదని మ్యాప్లతో సహా వివరించారు. కర్నూలు జిల్లాకేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో గడ్డిమైదానాలతో కూడుకొన్న రోళ్లపాడు అభయారణ్యానికి ప్రాజెక్టు వల్ల ప్రమాదం ఉన్నదని తెలిపారు.
అత్యంత అరుదైన బట్టమేక పక్షితో పాటు 19 రకాల వన్యప్రాణులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయని, ప్రాజెక్టు వల్ల బట్టమేక పక్షి ఆవాసం ధ్వంసమయ్యే ప్రమాదముందని వెల్లడించారు. మంత్రాలమ్మ కనుమ, నంది కనుమల మధ్య ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం పెద్దపులులు, పలురకాల అరుదైన వన్యప్రాణులకు నిలయమని తెలిపారు. కడప జిల్లా రెడ్డిపల్లిలో పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉన్న శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యం ‘జర్డన్స్ డబుల్ బ్యాండెడ్ కర్సర్’ అనే అత్యంత అరుదైన పక్షికి నిలయమని తెలిపారు. పూర్తిగా ప్రకృతి విధ్వంసకరమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
రిజర్వాయర్లన్నీ అటవీ రక్షిత ప్రాంతానికి పది కిలోమీటర్లలోపే ఉన్నాయని తెలిపే చిత్రం
ఏ రిజర్వాయర్ ఏ అటవీ ప్రాంతం దగ్గర్లో ఉందంటే..