మహబూబాబాద్ : ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్ పట్టణంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరును, పోలీసుల విధి నిర్వహణ విధానాన్ని ఆమె పరిశీలించారు. లాక్ డౌన్ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ సమయంలో గత ఏడాది నుంచి పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కట్టడి చేస్తూనే, కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారన్నారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏడాది లాక్ డౌన్ కు నాలుగు గంటలు మినహాయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు, కోవిడ్ నిబంధనల మేరకు నిత్యావసరాలు తీసుకునేటట్లు పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
గ్రామాల్లో కోవిడ్ కట్టడి, గుర్తింపు, చికిత్స కోసం వేసిన గ్రామ కమిటీల్లో కూడా పోలీసులు నిత్యం వారితో ఉంటూ లాక్ డౌన్ అమలు అయ్యేటట్లు, కోవిడ్ బారిన ప్రజలు పడకుండా ఉండేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో దాదాపు 4000 మంది కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఇంటి దగ్గరే మందులు ఇస్తూ, ధైర్యాన్ని చెబుతూ వారికి అండగా గ్రామ కమిటీలు పనిచేస్తున్నాయన్నారు.
అనవసరంగా బయటకు రాకుండా లాక్ డౌన్ పాటిస్తూ కోవిడ్ కట్టడికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. నిత్యావసరాలకు కూడా కుటుంబంలో ఎవరో ఒకరే బయటకు రావాలని, కుటుంబాన్ని కరోనా నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు