హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014) స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చినవారికి పాత స్కేలు వర్తింపజేస్తూ బుధవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో వేలమంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. స్థానిక సంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన చాలామంది.. కొంతకాలం సర్వీసు తర్వాత వివిధ పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 2, 3 ఉద్యోగులుగా ఏఎస్వో, డిప్యూటీ తాసిల్దార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లుగా కొత్త ఉద్యోగాల్లో చేరారు. కొత్త ఉద్యోగంలో చేరడంతో అప్పటికే కొన్నేండ్లపాటు టీచర్లుగా చేసిన సర్వీసుతోపాటు, వేతనాన్ని కూడా భారీగా కోల్పోయారు. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగం పొందే సమయంలో స్థానిక సంస్థలనుంచి వస్తున్న ఉద్యోగులు.. సర్వీసు, పేస్కేలు రెండింటినీ కోల్పోతున్న విషయాన్ని తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్రావు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆర్థిక మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై లోతుగా అధ్యయనంచేసిన సీఎం కేసీఆర్.. ఉద్యోగులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవోపై మాధవరం నరేందర్రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వోద్యోగులకు మరో వరం ఇచ్చారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.