రవీంద్రభారతి, జులై 6: తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరుతాయని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఆయన చాంబర్లో మాట్లాడుతూ, కరోనా కళాకారులకు ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేశారని, ఈ అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా సురభి నాటకాలు తిరిగి ప్రారంభమవుతాయని అన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సురభి నాటకోత్సవాలను కవులు, కళాకారులు విజయవంతం చేయాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ సెక్రటరీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.