తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం
రైతు వ్యతిరేక బీజేపీలో చేరిన ఈటల విమర్శలు చేయడం హాస్యాస్పదం
హుజూరాబాద్లోనూ సాగర్ ఫలితమే
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె
ఇల్లందకుంట, జూన్ 20: ఈటల పచ్చిమోసకారి అని, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు అనుభవించి, పార్టీకి వెన్నుపోటు పొడిచిన కుట్రదారు అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఈటలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం ఇల్లందకుంట మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈటలను కేసీఆర్ సొంత తమ్ముడిలా ఆదరిస్తే తల్లిపాలు తాగి తల్లిరొమ్ము గుద్దే రకంగా తయారైండని, పార్టీ విడిచి వెళ్లిండని మండిపడ్డ ఆయన, రేపు హుజూరాబాద్ ప్రజలను మోసం చేయవనే గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కృషితో హుజూరాబాద్ అభివృద్ధి చెందిందే తప్ప నువ్వేమైనా సొంతంగా చేశావా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి విమానాలను ప్రయివేటు పరం చేసిన ఆ పార్టీలో చేరిన ఈటల, ఇవ్వాళ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలను తెస్తూ రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీలో చేరిన నీవు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సాగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే హుజురాబాద్లోనూ పునరావృతం అవుతాయని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.