నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14: కర్షకుడి నెత్తిపై అకాల వాన పిడుగుపడింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వానదాటికి కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న తదితర పంటలకు తీరని నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో వరి, మొక్కజొన్న నేలకొరగగా, కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిముద్దయ్యింది. ధర్మరాజుపల్లిలో తాటి చెట్టు విరిగిపడి గాజే రవికి చెందిన గేదె మృత్యువాత పడింది. జమ్మికుంట మండలం మడిపల్లిలో మహమ్మద్ అంకూస్కు చెందిన నాటుకోళ్ల ఫాంలోకి వర్షపు నీరు చేరి కోళ్లు మృతిచెందాయి. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో దాదాపు 500 ఎకరాలలో హైబ్రీడ్ సీడ్ వరి గింజ నేల రాలినట్లు రైతులు వాపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండలం అల్వాలలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. హుస్నాబాద్ పట్టణంతోపాటు డివిజన్లోని అక్కన్నపేట, కోహెడ మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్లో రేగుల కనకయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగుపడి మృత్యువాత పడింది. చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి, ధూళిమిట్ట మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మర్మాముల, గాగిళ్లాపూర్, మద్దూరు, లద్నూర్ తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పరిధిలో వందల ఎకరాల్లో జొన్న పంటలు నేలవాలాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో 224 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. మదనాపురం మండలం అజ్జకొల్లు, తిర్మలాయపల్లి, రామన్పాడులో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం పారుపల్లిలో పురాతన ఇల్లు కూలింది. దేవరకద్ర, మూసాపేట, అడ్డాకుల, చిన్నచింతకుంట మండలాల్లో వర్షంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిచింది. హన్వాడ మండలంలో రాగుల పంట నేలకొరిగింది. మామిడి కాయలు నేలరాలాయి.