అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ కథాంశాల్ని ఎంచుకుంటూ పతాకస్థాయి భావోద్వేగాలతో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తారాయన. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. తన కెరీర్లో ఇప్పటివరకు స్పృశించని ఓ అడ్వెంచర్ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయం గురించి రాజమౌళి తండ్రి, అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే ఓ అడ్వెంచరస్ ఇతివృత్తంతో మహేష్బాబు చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రముఖ ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా కథా రచన చేయబోతున్నామని చెప్పారు. హలీవుడ్లో జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఎన్నో ప్రజాదరణ పొందిన చిత్రాలొచ్చాయి. తెలుగులో కూడా అదే స్థాయి సాంకేతికతతో మహేష్బాబును పూర్తిగా కొత్త పంథాలో ఆవిష్కరిస్తూ రాజమౌళి ఈ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్లు పూర్తయిన తర్వాతే మహేష్బాబు-రాజమౌళి కాంబినేషన్ చిత్రం పట్టాలెక్కనుంది.