కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు
జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలు
జిన్గుర్తి, బషీరాబాద్ ప్రాంతాల్లో ఏర్పాట్లు
వికారాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం టెస్టు, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పద్ధతులను జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 45 ఏండ్లు పైబడిన వారికి కూడా ఈ నెల 1 నుంచి వ్యాక్సినేషన్ను వేగవంతం చేశారు. వికారాబాద్ జిల్లాలో కొవిడ్ కేసులు రెండు నెలల క్రితం వరకూ సాధారణ సంఖ్యలోనే ఉన్నాయి. కరోనా లక్షణాలు కనిపించిన వారికి కూడా కొద్దిపాటి జాగ్రత్తలు సూచిస్తూ కేసుల సంఖ్య పెరుగకుండా చూశారు.
గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో కొవిడ్-19 కేసుల ఉధృతి ఇప్పుడు ఉధృత రూపం దాలుస్తున్నది. దీంతో జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు సూచించటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. శుక్రవారానికి జిల్లాలో 176 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తాండూరులో 38, వికారాబాద్ జిల్లా కేంద్రంలో 33, మర్పల్లి, బషీరాబాద్ మండలాల్లో 14 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 45-59 ఏండ్ల మధ్య ఉన్నవారు 2లక్షల 89వేల మంది ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం 4325 మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1977 మందికి వ్యాక్సినేషన్ వేయగా..45.7% నమోదైంది. టెస్టుల విషయానికి వస్తే ఆర్ఏటీ 3300లకు 2713 చేయగా.. 82.2% నమోదైంది. ఆర్టీసీఆర్ 200లకు 62 మందికి పరీక్షలు నిర్వహించగా.. 31% నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకనుగుణంగా కొవిడ్ హాస్పటల్స్లో 30 బెడ్స్ ఏర్పాటు చేశారు. శనివారం జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ శాఖల అధికారులు విసృత్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ చేయించారు.
స్వీయ నియంత్రణే మార్గం..
నిర్లక్ష్యం వీడి, స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి సాధ్యమని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండే తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. చేతులు శుభ్రం చేసుకోవడంతోపాటు శానిటైజర్ను వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కట్టడి, వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలి.. లేకపోతే ఇంటి నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేశారు.
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రెవెన్యూ, పోలీసు, పురపాలక, పంచాయతీశాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పండుగలు, సభలు, సమావేశాల సందర్భంగా కొవిడ్ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పౌసమి బసు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు డివిజన్ పరిధిలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. జిన్గుర్తి, బషీరాబాద్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నాం.