అడవి శేష్ కథానాయకుడిగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గూఢచారి’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించబోతున్నారు. ‘గూఢచారి’ సినిమా విడుదలై మూడేళ్లయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ప్రకటన త్వరలో ఉంటుందని అడవి శేష్ తెలిపారు. ‘నాకు ఇష్టమైన సినిమాల్లో ‘గూఢచారి’ ఒకటి. ముఖ్యంగా పిల్లలు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆగస్ట్ నెల నాకు కలిసొస్తుంది. ఈ మాసంలోనే గూఢచారి సీక్వెల్కు సంబంధించిన వివరాల్ని మీతో పంచుకుంటా’ అని అడవి శేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. సీక్వెల్ చిత్రానికి కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించబోతున్నారు.