వ్యాయామం, యోగా వంటి ఆరోగ్య పరిరక్షణ సాధనాల్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించింది ఢిల్లీ సొగసరి అదాశర్మ. శరీరం, మనసుని సమన్వయం చేయడంలో ఫిట్నెస్ యాక్టివిటీస్ దోహదపడతాయని చెప్పింది. యోగాతో పాటు సిలంబం వంటి సంప్రదాయ విద్యలో నిష్ణాతురాలైన ఈ అమ్మడు తన సోషల్మీడియా ఖాతాలో తరచుగా ఫిట్నెస్ వీడియోల్ని పోస్ట్ చేస్తుంటుంది. వ్యాయామం వల్ల లాభాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా రోజువారి దినచర్యగా మార్చుకుంటే ఎల్లప్పుడు సంతోషంగా ఉంటామని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నేను రెగ్యులర్ వ్యాయామాలతో పాటు వివిధ రకాలైన మార్షల్ ఆర్ట్స్ను కూడా ప్రాక్టీస్ చేస్తుంటా. చాలా మంది ఆరోగ్యంగా ఉండాలంటే అవన్నీ అవసరమా అని ప్రశ్నిస్తుంటారు. వారందరికి నా సమాధానం ఒక్కటే…ప్రతి రోజు గంటన్నర సమయాన్ని శరీరం కోసం వెచ్చిస్తే జీవితమంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం. ఫిట్నెస్ విషయంలో నేను ఎలాంటి లక్ష్యాల్ని నిర్దేశించుకోలేదు. అన్ని విద్యలూ నేర్చుకొని ప్రదర్శించాలనే తాపత్రయం లేదు. నాలాంటి యువతులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఫిట్నెస్ వీడియోల్ని సోషల్మీడియాలో రెగ్యులర్గా షేర్ చేస్తుంటా’ అని చెప్పింది. సినిమాలు తప్ప నిజ జీవితంలో తాను ఫ్యాషన్ ధోరణుల్ని పట్టించుకోనని…నచ్చిన పనుల్ని చేస్తూ జీవితాన్ని ఆస్వాదించే స్వేచ్ఛనే నిజమైన ఫ్యాషన్ అని తెలిపింది అదాశర్మ. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘క్వశ్చన్ మార్క్’ సినిమాతో పాటు నాని నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తోంది.