న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇండియా ఓపెన్ వాయిదా పడింది. దేశంలో రోజురోజుకు వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా పేర్కొన్నారు. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లో ఒకటైన ఇండియన్ ఓపెన్ వచ్చే నెల 11 నుంచి 16 వరకు ఢిల్లీలో జరుగాల్సింది. అయితే దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకుని బాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘టోర్నీ నిర్వహణ విషయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్)తో పాటు ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, నిర్వాహకులతో సంప్రదింపులు జరిపాం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నాం’ అని సింఘానియా అన్నారు. ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్, మాజీ ప్రపంచ విజేత రచనోక్ ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగారు.