అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పాక్షిక లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూలు విధించారు. తాజా ఇవాళ గుజరాత్ ప్రభుత్వం హోలీ వేడుకలకు అనుమతి నిరాకరించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హోలికా దహనం మాత్రమే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగనుండగా.. వేడుకలకు ముందురోజు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే హోలీ వేడుకల్లో భాగంగా హోలికా దహనానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తున్నది. గ్రామస్తులు, హౌజింగ్ సొసైటీ సభ్యులు సాధ్యమైనంత తక్కువ మందితో ఈ వేడుక నిర్వహించుకోవాలని డిప్యూటీ సీఎం నితీన్ పటేల్ సూచించారు. ‘ప్రజలు గుంపులుగా సంచరించేందుకు వీల్లేదు. ఒకరికొకరు రంగులు పులుముకోవడం నిషేధం. హోలీ వేడుకలకు అనుమతి లేదు. నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పటేల్ హెచ్చరించారు.