న్యూఢిల్లీ : గతేడాది కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. నాటి నుంచి సాయం కోరిన వారందరినీ ఆదుకుంటూ వస్తూ రియల్ హీరోగా నిలిచాడు. తాజాగా కరోనా సోకి ఊపిరితిత్తులు దెబ్బతిన్న యువతిని చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్లో తరలించారు. నాగ్పూర్కు చెందిన భారతి (25) అనే యువతి కరోనా బారినపడగా.. 85-90 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. స్థానిక వోక్హార్డ్ట్ హాస్పిటల్కు తరలించారు. దీంతో ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదంటే, ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని, ఈ సదుపాయం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న సోనుసూద్ వెంటనే అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లను సంప్రదించారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ థెరపీ (ఈసీఎంఓ) సహాయంతో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయొచ్చని, తద్వారా ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించొచ్చని తెలుసుకున్నారు. డాక్టర్లకు భారతి పరిస్థితిని వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఆరుగురు వైద్యుల బృందం ఈసీఎంఓ పరికరాలతో నాగ్పూర్కు రాగా.. వారి కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
అనంతరం భారతిని హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతోంది. దీనిపై సోనుసూద్ స్పందిస్తూ అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పారని తెలిపారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతోందని చెప్పారు. త్వరలోనే కోలుకొని తిరిగి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారతి తండ్రి రైల్వే రిటైర్డ్ అధికారి. ఆపత్కాలంలో అండగా నిలిచిన సోనుసూద్కు యువతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనా పాజిటివ్గా పరీక్షించిన సోనుసూద్.. శుక్రవారం నెగెటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.