బీజింగ్: చైనాలోనే పుట్టిన కరోనా ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది చైనా ఎగుమతులు అత్యధిక స్థాయిని అందుకోవడం గమనార్హం. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశ అధికారిక డేటా వెల్లడించింది. కరోనా కాలంలో మాస్క్ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్కు డిమాండ్ ఏర్పడింది. ఈ రెండింటిలోనూ చైనా ఎగుమతులు భారీగా పెరగడం విశేషం.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. జనవరి-ఫిబ్రవరి ఎగుమతులు చూస్తే ఏకంగా 60.6 శాతం మేర ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా 22.2 శాతం పెరిగినట్లు ఆ డేటా తెలిపింది. గతేడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. చైనా ప్రస్తుతం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లుగా ఉంది.