తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తన తల్లిదండ్రులపై పోలీస్స్టేషన్లో కేసు పెట్టడం కోలివుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఎలాంటి అనుమతి లేకుండా తన పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే… విజయ్ తండ్రి, సీనియర్ దర్శకనిర్మాత యస్.ఏ.చంద్రశేఖర్ గత ఏడాది ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీనికి ఆయన జనరల్ సెక్రటరీగా, భార్య శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అయితే తండ్రి పెట్టిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ గతంలోనే ప్రకటించారు. అభిమాన సంఘాలు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవద్దని కోరారు.
అయితే ఇటీవల జరుపుతున్న పార్టీ వ్యవహారాల్లో తన ఫొటోను వాడుకుంటున్నారని, అభిమాన సంఘాలను కూడా భాగం చేస్తున్నారని విజయ్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో పాటు పార్టీ ముఖ్యనేతలుగా భావిస్తున్న మరో పదకొండు మందిపై విజయ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసు గత శుక్రవారం స్థానిక మద్రాస్ కోర్టులో విచారణకు వచ్చింది. తన పేరు, ఫొటోల్ని వాడకుండా నిషేధం విధించాలని విజయ్ కోర్టును అభ్యర్థించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. తమిళనాట అత్యంత ప్రాచుర్యం కలిగిన కథానాయకుడు విజయ్ సొంత తల్లిదండ్రులపై కోర్టుకెక్కడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.