యేటా వివిధ జాతరల సందర్భంగా నిర్వహణ
పోటాపోటీగా తలపడుతున్న మల్లయోధులు
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పోటీదారులు
మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో రాక
తిలకించేందుకు స్థానికుల ఆసక్తి
నిర్మల్ టౌన్/ కుభీర్, మార్చి 20:నిర్మల్ జిల్లాలో కుస్తీ పోటీలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఏ ఆలయాల్లో ఉత్సవాలు జరిగినా, పండుగలు వచ్చినా పూజలతోపాటు ప్రాంగణాల్లో కుస్తీ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో మల్లయోధులు పోటీ పడుతున్నారు. మొబైల్ గేమ్స్, వివిధ అధునిక క్రీడలు రాజ్యమేలుతున్న నేటి తరుణంలో, పురాతన సంప్రదాయ క్రీడైన కుస్తీ పోటీలను ఇంకా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. విజేతలకు వివిధ రూపాల్లో బహుమతులు అందిస్తూనే, నేటి తరానికి ఈ క్రీడను పరిచయం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా చోట్ల ఫిబ్రవరి నుంచి మే వరకు సాగే ఈ పోటీలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
‘కండబలంతో వేగంగా దూసుకొస్తున్న మరో బలాఢ్యుడిని వేగంగా పరుగెత్తి అడ్డుకొని, ఎత్తుకు పైఎత్తు చిట్కాలతో వెల్లకిలా చేయడం కుస్తీ పోటీల్లో ప్రధానం. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఏటా పండుగలు, జాతరల సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఎక్కడ పోటీలు నిర్వహించినా మల్లయోధులతో పాటు వారిని ప్రోత్సహించేందుకు జనం కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కుంటాల మండలంలోని ఓలా, సూర్యాపూర్, కుభీర్ మండలంలోని పార్డి, కుభీర్ మండల కేంద్రం, మగగాం, తానూరు మండల కేంద్రంతో పాటు భోసి, మొగ్లి, ముథోల్ మండలంలోని ఎడ్బిడ్, తదితర ప్రా
ంతాల్లో యేటా కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే నెల చివరి వరకు నిర్వహిస్తుంటారు. పోటీలు ఆద్యంతం అలరిస్తుండగా, వీక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలతో మల్లయోధుల్లో ఉత్సాహం నింపుతుంటారు. విజేతను భుజాన ఎత్తుకొని ప్రాంగణంలో చక్కర్లు కొడతారు. పోటీలకు ముందు ప్రకటించినట్లుగా విజేతకు నగదు బహుమతి అందించి సత్కరిస్తారు.
యేటా పోటీలు నిర్వహిస్తాం..
మా గ్రామంలో మూడేళ్ల క్రితం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో శివాలయాన్ని కొత్తగా నిర్మించాం. మా గ్రామం పక్కనే సూర్యాపూర్ గ్రామంలో 20 ఏళ్ల నుంచి కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకు మరుసటి రోజు ఇక్కడ పోటీలు నిర్వహించాలని శివాలయ ఆలయ కమిటీ ద్వారా తీర్మానం చేసుకున్నాం. మూడేళ్ల నుంచి పోటీలు నిర్వహించి వచ్చిన మల్లయోధులతో పాటు సాధారణ భక్తులకు అన్నదానం చేస్తున్నాం. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద రూ. 5వేలు, ద్వితీయ బహుమతి కింద రూ. 3వేలతో పాటు వెండి ఉంగరాన్ని బహూకరిస్తున్నాం. ఏటా పోటీలో పాల్గొనే మల్లయోధుల సంఖ్య పెరుగుతున్నది. వారికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
70 ఏళ్లు వచ్చినా పోటీలకు..
నా వయస్సు 70 ఏళ్లు. 30 ఏళ్ల నుంచే కుస్తీ పట్టడం నేర్చుకున్నా. జిల్లాలో ఎక్కడ కుస్తీ పోటీలు నిర్వహించినా తప్పకుండా వెళ్తా. పోటీల్లో ప్రత్యర్థితో కుస్తీ పడుతా. ధోతి కట్టుకొని కుస్తీ పట్టి గెలిచినా, ఓడినా పోటీల్లో పాల్గొన్నందుకే చాలా తృప్తి అన్పిస్తది. కుస్తీ పట్టడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాయి. ఇప్పటివరకు సుమారు 50సార్లు కుస్తీ పట్టగా.. 30సార్లు గెలిచిన.. 20సార్లు ఓడిన. వయస్సు మీద పడుతున్నా కుస్తీ మాత్రం మరువలేకపోతున్నా. -దిగంబర్, తానూర్
పట్టుదలతో రాణిస్తున్నా
చిన్నప్పటి నుంచి ఈపోటీలపై మక్కువ పెంచుకొని ఆసక్తితో మెళకువలు (అట్కలు) నేర్చుకొని పట్టుదలతో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజయం సాధిస్తున్నా. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. మహారాష్ట్రలో ప్రభుత్వం మాకెలాంటి ప్రోత్సాహం అందించదు. అయినా మాకు ఇష్టం ఉండడంతో కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపైనా, ఓటమినైనా స్వీకరించి వెళతాం. మా రాష్ట్రంతో పాటుతెలంగాణలోనూ ఈ పోటీలకు ప్రాధాన్యం ఉంది. అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే ఆ ఆనందమే వేరు. -సాంగే దిలీప్ కిషన్, బామ్ని, మహారాష్ట్ర