న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కార్పొరేషన్ ట్యాక్స్ రూ 4.57 లక్షల కోట్లు వసూలు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ 4.88 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
రిఫండ్స్ చెల్లించకముందు స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ 12.06 లక్షల కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు కరోనా మహమ్మారితో పలు సవాళ్లు ఎదురైనా గత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.7 శాతం వృద్ధితో రూ 4.95 లక్షల కోట్లుగా నిలిచాయి.