వర్గల్, మే 16 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ప్రతి ఇంట్లో విషాదాన్ని నింపుతున్నది. కరోనా వచ్చిందంటే చాలు.. బతుకుపై అపనమ్మకం అలుముకున్న స్థితి. కరోనాతో చనిపోయిన కుటుంబాల్లో తీరని వ్యథ. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. నియంత్రణకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలకు ప్రజలకు సంపూర్ణ మద్దతు పలుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఫ్రంట్ వారియర్స్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తూ కరోనా బాధితుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. భాగంగా వర్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారి మొదటిదశ నుంచి రెండో దశవరకు నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూనే కరోనా సోకిన ప్రతి వ్యక్తిలో ధైర్యం కోల్పోకుండా వారిలో మనోధైర్యం నింపుతున్నారు.
42 సిబ్బంది .. 34 గ్రామాలు
వర్గల్ ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ హరిత, ఇద్దరు సూపర్వైజర్లు, ఏడుగురు ఏఎన్ఎంలు, ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు, 27 మంది ఆశవర్కర్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ మొత్తం 42 వైద్య సిబ్బం ది ఉన్నారు. వర్గల్ మండలాన్ని 5 వేల జనాభా ప్రాతిపదికగా, 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక ఏఎన్ఎం, నలుగురు ఆశ వర్కర్లు ప్రజ ల ఆరోగ్య బాధ్యతలను చూస్తున్నారు. మండలంలోని 2 క్లస్టర్లల్లో 6 నుంచి 7 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఐదుగురు ఆశవర్కర్లు పని చేస్తున్నారు.
కొవిడ్ బాధితులకు స్వాంతన..
గ్రామాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా ఏఎన్ఎం, ఆశవర్కర్లు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. కొన్ని సమయాల్లో బాధితుల ఇంటికి వెళ్లి నేరుగా లేదా ఫోన్ ద్వారా మాట్లాడి ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నారు.
పారిశుధ్యంపై అవగాహన
గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శుల నేతృత్వంలో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు గ్రామాల్లో పర్యటిస్తూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడకంతోపాటు భౌతిక దూరం పాడించడం.. రోజువారీ దినచర్యగా మార్చుకోవాలని వివరిస్తున్నారు. ఆరోగ్య పరిశుభ్రతతోపాటు ఆరోగ్యసంరక్షణపై ప్రజలు వర్గల్ పీహెచ్సీ సిబ్బంది వివరిస్తున్నారు.
సేవను భారంగా భావించడం లేదు
2007లో ఏఎన్ఎంగా చేరా. ప్రస్తుతం వర్గల్ ప్రభుత్వ దవాఖాన పరిధిలోని నెంటూర్ క్లస్టర్లో విధులు నిర్వహిస్తున్నా. గతంలో కంటే ఇప్పుడు పని ఒత్తిడి ఉంది. ఆరోగ్య సేవను భారంగా భావించడం లేదు. ప్రతిరోజు క్లస్టర్ పరిధిలో కరోనా వచ్చిన వారితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిని కలుసుకోవడం బాధ్యతగా అలవాటు చేసుకున్నా.
-పి.శ్రీలత, ఏఎన్ఎం నెంటూర్, వర్గల్ మండలం
సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా
నిత్యం వైద్యసేవల్లో నిమగ్నమయ్యే మేము.. కరోనా బాధితులతో పని ఒత్తిడి పెరిగింది. కరోనా విపత్కర పరిస్థితిలో కూడా పని భారమైనా తోటి సిబ్బందితో కలిసి బాధితులకు సేవ చేస్తున్నాం. దవాఖానకు వచ్చే వారికి ర్యాపిడ్ టెస్టు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యం కల్పించి మందులిచ్చి పంపిస్తున్నాం.