కరోనా సెకండ్వేవ్ ఉధృతి సినీరంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముందస్తుగా నిర్ణయించుకున్న సినిమా రిలీజ్లన్నీ వాయిదా పడుతున్నాయి. కరోనా వల్ల ఉత్పన్నమైన అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియని పరిస్థితుల్లో నిర్మాతలు వేచిచూసే ధోరణితో ఉన్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు రామ్చరణ్, నిరంజన్రెడ్డి ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కోవిడ్ సెకండ్వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.రామ్చరణ్, కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే, సోనూసూద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: కొరటాల శివ.